Tuesday, January 25, 2011

నూరేళ్ల జనగణమన (మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాకి వందేళ్లు)

జాతీయ గీతం (రవీంద్రనాథ్ ఠాగూర్)

జనగణమన అధినాయక జయహే!
                        భారత భాగ్య విధాతా!
పంజాబ, సింధు, గుజరాత, మరాఠా!
                           ద్రావిడ, ఉత్కళ, వంగ!
వింధ్య, హిమాచల, యమునా, గంగ!
                            ఉచ్చల జలధితరంగ!
తవశుభనామే జాగే! తవ శుభ ఆశిష మాగే!
                              గాహే తవ జయగాథా!
జనగణమంగళ దాయక జయహే!
                              భారత భాగ్య విధాతా!
జయహే! జయహే! జయహే!
జయ జయ జయ జయహే!

ప్రజలందరి మనస్సుకూ అధినేతవు, భారత భాగ్య విధాతవు అయిన నీకు జయమగు గాక. పంజాబ, సింధు, గుజరాత్, మహారాష్ట్ర, ద్రావిడ, ఉత్కళ, వంగ దేశాలతోను, వింధ్య, హిమాలయ పర్వతాలతోను, యమునా, గంగా ప్రవాహాలతో ఉవ్వెత్తున లేచే సముద్ర తరంగాలతోను శోభించే ఓ భాగ్య విధాతా! వాటికి నీ శుభనామం ఉద్బోధ కలిగిస్తుంది. అవి నీ ఆశీస్సులను ఆకాంక్షిస్తాయి. నీ జయ గాథల్ని గానం చేస్తాయి. సకల జనులకు మంగళకారివి. భారత భాగ్య విధాతవూ అయిన నీకు జయమగుగాక! జయమగుగాక! జయమగుగాక!


విశ్వకవి రవీంద్రుని కలం నుంచి జాలు వారిన గీతం 'జనగణమన'. యావత్ భారతావనిని ఏకతాటిపై నిలిపిన స్ఫూర్తి గీతిక ఇది. మన జాతీయ గీతానికి నూరేళ్లు. రవీంద్రుడు దేశానికి ఇచ్చిన కానుక ఇది. భరతమాత కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటే గేయం ఇది. భారత దేశ భౌగోళిక స్వరూపం కళ్లకు కట్టే అక్షర చిత్రం. జనగణమన పూర్తి గేయం 5 చరణాలు కాగా మనం మొదటి చరణం మాత్రమే ఆలపిస్తాం.


జనగణమన చరిత్ర

దీనిని తొలిసారిగా 1911 డిసెంబరు 27న కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సభలో ఆలపించారు.

ఈ గీతానికి జాతీయ హోదాను కల్పిస్తూ 1950వ సంవత్సరం జనవరి 24వ తేదీన రాజ్యాంగ అసెంబ్లీ తీర్మానించింది.

భారతదేశ సమున్నతిని చాటిచెబుతూ, ప్రతి భారతీయుని మదిలో జాతీయ భావాన్ని పురికొల్పే రీతిలో సాగిన రవీంద్రుని 'జనగణమన' నేటికి దేశభక్తిని ప్రభోది స్తున్నది. జనగణమనను బాణీ కనుగుణంగా  గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి, చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. దీనికి 20 సెకండ్లు పడుతుంది. రవీంద్రుడు ఈ గీతాన్ని రాసిన తొలినాళ్ళలో కేవలం కొంతమందికి మాత్రమే పరిచయంలో ఉండేది. అదీ కూడా రవీంద్రుని సంపాదకత్వంలో బ్రహ్మ సమాజం తరుపున వెలువడే 'తత్త్వ బోధ ప్రకాశిక' అనే పత్రిక పాఠకులకు మాత్రమే దీనితో అనుబంధం ఏర్పడింది.
 జనగణమనకు ఆంధ్రాతో అనుబంధం
ఇప్పుడు అందరి నోటా రాగయుక్తంగా ఆలపించబడుతున్న 'జనగణమన'ను ఆంగ్లంలో అనువదించడమూ, దానిని స్వర పరచడం రెండూ మన ఆంధ్రరాష్ట్రంలోనే జరగడం ఎంతో గర్వకారణం. చిత్తూరు జిల్లా మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలలో ఈ ప్రక్రియ సాగింది. 1919లో బెంగుళూరు వచ్చిన రవీంద్రుడు అదే సంవత్సరం ఫిబ్రవరి మాసంలో మదనపల్లెలోని బీసెంట్‌ దివ్యజ్ఞాన కళాశాలను సందర్శిం చాడు. ఆ కళాశాల నెలకొన్న వాతావరణం, ప్రకృతి శోభకు రవీంద్రుడు ఎంతగానో పులకించి పోయాడు. అదే సమయంలో అక్కడి విద్యార్ధులకు తాను రచించిన 'జనగణమన' గీతాన్ని నేర్పాడు. కళాశాల ప్రిన్సిపల్ జేమ్స్‌ కజిన్స్‌ కోరికపై జనగణమన గీతాన్ని 'మార్నింగ్‌ సాంగ్‌ ఆఫ్‌ ఇండియా' అన్న పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఈ తర్జుమా ఒరిజినల్ ప్రతి ఇప్పటికీ మదనపల్లెలో బీసెంట్ దివ్యజ్ఞాన సమాజ కాలేజ్ లో భద్రంగా ఉంది. జేమ్స్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్  యూరోపియన్‌ సంగీత విద్వాంసురాలు, ఆమెతో కలిసి రవీంద్రుడు ఈ గీతానికి సంగీతాన్ని సమకూర్చారు. ఆ తరువాత కాలంలో 'జనగణమన' గీతం భారతీయ భాషలు అన్నిటిలోకి అనువదించబడింది.

వివాదాల సుడి
భరత జాతి ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఈ గీతం చుట్టూ కొన్ని వివాదాలూ ఉన్నాయి. 1911లో కింగ్ జార్జి-5 పట్టాభిషేక తరుణంలో తెరపైకి వచ్చిన ఈ గీతం ఆయనను కీర్తించేందుకు ఉద్దేశించినదేనన్నది ప్రధాన విమర్శ. 

ఆనాటి జార్జి చక్రవర్తి జార్జ్‌ భారత్‌ పర్యటిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనను కీర్తిస్తూ ఈ గేయాన్ని రచించారన్నది కొన్ని పత్రికలు విమర్శలు చేశాయి.గీతంలోని 'భారత భాగ్య విధాత.. అధినాయక' అనే పదాలు భగవంతుణ్ని ఉద్దేశించినవి కాదని, అవి కేవలం కింగ్ జార్జి-5ను కీర్తిస్తూ రాసినవన్న విమర్శలున్నాయి. తొలిసారి ఈ గీతాలాపన జరిగిన మర్నాడు పలు బ్రిటన్ పత్రికల్లో సైతం ఈ గీతం ఉద్దేశం అదేనంటూ వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలను తర్వాత ఠాగూర్ నిర్ద్వంద్వంగా ఖండించారు. రవీంద్రుడు తన మిత్రునికి లేఖ రాస్తూ తన గేయంపై వచ్చిన విమర్శనాత్మక ప్రచారం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నాడు. తాను ఈ గేయంలో కేవలం జయాన్ని, భగవంతుని మాత్రమే కీర్తించానని తెలిపాడు. ఏ రాజుల కోసం, ఏ చక్రవర్తుల కోసమో, మరే పాలకుల కోసమో దీనిని తాను రచించలేదని కేవలం భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకునే రాశానని తన లేఖలో నిర్ద్వందంగా ఖండించాడు.
అలాగే ఈ గీతంలో పంజాబ, సింధు, గుజరాత, మరాఠ.. అంటూ సాగే రాష్ట్రాల పేర్లపైనా వివాదం ఉంది. అలనాటి సంస్థానాల ప్రస్తావనే అందులో లేదన్నది ప్రధాన అభ్యంతరం. విభజన అనంతరం పాకిస్థాన్ పరిధిలోకి వెళ్లిన సింధును తొలగించి, మన కాశ్మీర్‌ను గీతంలో చేర్చాలన్న డిమాండ్ ఉంది. అన్నిటినీ మించి స్వాతంత్య్ర సమరంలో ప్రతి ఒక్కరిలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన 'వందేమాతరా'న్ని కాదని 'జన గణ మన'ను జాతీయ గీతంగా ఆమోదించడం పట్ల కూడా పలు అభ్యంతరాలున్నాయి!!


జనగణమన గీతం విశ్వకవి ఆత్మనే కాదు యావత్‌ భారతదేశాత్మను కూడా నినదింపజేస్తోంది. దీన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ జాతీయ గీతంగా యునెస్కో గుర్తించింది. అతి విలువైన, అమూల్యమైన అవార్డు మన గీతానికి దక్కడం భారతీయులుగా మనకందరికీ గర్వకారణం. ఆ బాలగోపాలానికి ప్రీతిపాత్రమైన ఈ గీతాన్ని కలకాలం నిలుపు కుందాం. దేశం దశ దిశలా మారుమోగే ఈ సుందర గీతాన్ని గుండెగుండెలో నింపుకుందాం.జైహింద్.
 

3 comments: